అదేంటో... కొంతమంది అదే పనిగా నెగిటీవ్ గా ఆలోచిస్తారు. పాజిటీవ్ పనిలోనూ.... ఏదో ఓ తప్పు వెదుకుతుంటారు. కోడి గుడ్డుపై ఈకలు పీకడం అంటారే.. ఆ టైపు అన్నమాట. శత్రుఘ్న సిన్హా ఇప్పుడు అదే పని చేశారు. అక్షయ్ కుమార్ ఇచ్చిన భారీ విరాళాన్ని ఆయన తప్పు పడుతున్నారు.
కరోనాపై పోరాటంపై స్టార్లంతా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. ఆ తరవాత మరో 3 కోట్లు ఇచ్చాడు. ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమారే. దాంతో.... అక్షయ్పై ప్రశంసల జల్లు కురిసింది. అయితే విచిత్రంగా శత్రుఘ్న సిన్హా మాత్రం విమర్శించడం మొదలెట్టారు. అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం ఇతరులను కించపరచడమే అని, ఒకవేళ ఇస్తే... ఆ సంగతి గోప్యంగా ఉంచాలని తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు.
డొనేషన్లు ఇవ్వడం తప్పులేదని, అయితే కొంతమంది దీన్నో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని, పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి, పబ్లిసిటీ చేసుకోవడం వల్ల. చిన్న మొత్తంలో విరాళాలు ఇచ్చేవాళ్లు వెనకడుగు వేస్తారని లాజిక్కులు తీశారు. ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు భారీగా విరాళాలు అందించారని, అయితే వాళ్లెక్కడా గొప్పలు చెప్పుకోలేదని, ఇండియాలోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారాయన.
అయితే.. శత్రుఘ్న మాటల్ని నెటిజన్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డబ్బులు ఇచ్చినవాళ్లని పట్టుకుని నిందించడం కరెక్టు కాదని, వీలైతే మీరు కూడా చేతనైనంత సహాయం చేయాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.