ఈ సంక్రాంతికి నువ్వా? నేనా? అంటూ పోటీపడుతున్నారు మహేష్బాబు, అల్లు అర్జున్. మహేష్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురం' రెండూ జనవరి 12నే విడుదలకు సిద్ధమయ్యాయి. రెండు సినిమాలూ ఒకే రోజంటే ఎలా? అన్నది బయ్యర్ల భయం. ఎంత కాదన్నా.. కలక్షన్లు రెండుగా పంచుకోవాల్సివస్తుంది. దాంతో మహేష్, బన్నీలలో ఒకరు తగ్గాల్సివచ్చింది. కానీ.. ఇద్దరూ ససేమీరా అనడంతో జనవరి 12 రగడ అలానే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు నిర్మాతలూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారని టాక్.
రెండు సినిమాలూ విడుదల తేదీ మార్చుకోవడానికి రెడీ అయ్యాయని సమాచారం. 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 12 బదులుగా 11న విడుదల అవ్వబోతోందని, 'అల వైకుంఠపురంలో' కూడా జనవరి 12న కాకుండా 13న విడుదల కానున్నదని, అలాగైతే రెండు సినిమాల మధ్య 2 రోజుల విరామం వస్తుందని, అది రెండు సినిమాలకూ మంచిదని నిర్మాతలు భావిస్తున్నార్ట. రెండు సినిమాలూ విడుదల తేదీ మార్చుకోవడం వల్ల ఒకరు వెనక్కి తగ్గినట్టో, మరొకరు గెలిచినట్టో అవ్వదు కదా. అందుకే మధ్యేమార్గంగా ఈ ప్రతిపాదనకు అటు మహేష్, ఇటు బన్నీలు ఒకే చెప్పినట్టు సమాచారం.
కొత్త రిలీజ్ డేట్లు కూడా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.