త్రివిక్రమ్ కి ఓ పట్టాన ఏదీ నచ్చదు. సినిమాని చెక్కుకుంటూ వెళ్తుంటాడు. చిన్న డౌట్ వచ్చినా - మళ్లీ మొదట్నుంచి మొదలెట్టడం ఆయనకు అలవాటే. అందుకే ఆయన సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. రీషూట్లు జరుపుకోవడం కూడా పెద్ద విచిత్రం ఏమీ కాదు. 'అల.' వైకుంఠపురములో` విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరవాత కూడా, రీషూట్లు చేశారని తెలుస్తోంది. ప్యాడింగ్ ఆర్టిస్టుల డేట్లు మళ్లీ తీసుకుని, మూడు రోజుల పాటు కొన్ని సన్నివేశాల్ని తిరిగి తెరకెక్కించారని, లింకులు మిస్సయ్యాయి అనుకున్న చోట్ల - కొన్ని సన్నివేశాలు మళ్లీ రాసి, వాటిని షూట్ చేశారని తెలుస్తోంది.
ఈ సంక్రాంతికి వస్తున్న 'అల.. వైకుంఠపురములో'కి గట్టి పోటీ ఎదురు కానుంది. ముఖ్యంగా మహేష్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో ఢీ అంటే ఢీ అంటూ రంగంలోకి దిగబోతోంది. ఏ చిన్న తప్పు చేసినా - అదే సినిమాని ముంచేస్తుంది. అందుకే త్రివిక్రమ్ ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తపడిపోతున్నాడని, అందుకే రీషూట్లు చేయడానికి కూడా వెనుకంజ వేయలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం ఆర్.ఆర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 6న హైదరబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేసింది చిత్రబృందం. అంతకు ముందే పబ్లిసిటీని ముమ్మరం చేయాలని గీతా ఆర్ట్స్ భావిస్తోంది.