నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో రెండు సినిమాలొచ్చాయి. అవే 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద'. ఈ రెండు సినిమాలూ హీరోగా నాగశౌర్యకూ, డైరెక్టర్గా అవసరాల శ్రీనివాస్కీ మంచి విజయాలందించాయి. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. అదే 'ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి' చిత్రం. ఇది కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గానే ఉండబోతోందట.
క్యూట్ లవ్స్టోరీ, ఎమోషనల్ టచ్తో ఈ సినిమా రూపొందనుందట. కానీ, ఇందులో ఊహించని ఓ ట్విస్ట్ని మిళితం చేశాడట డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్. ఆ అబ్బాయి, అమ్మాయికి ముందు 'ఫలానా' అని పెట్టాడే.. అక్కడే ట్విస్ట్ ఉండబోతోందట. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్సే. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. ప్రస్తుతం నాగశౌర్య తన సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే ఈ మధ్య నాగశౌర్య కాలికి ఫ్రాక్చర్ అవడంతో షూటింగ్కి తాత్కాలికంగా వాయిదా పడింది.
గాయం నుండి పూర్తిగా కోలుకోకుండానే, తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు నాగశౌర్య. ఇక నాగశౌర్య నటించిన 'ఓ బేబీ' రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చి, వసూళ్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా నటిస్తూనే, ఇలా గెస్ట్ పాత్రల్లో నటించడం కూడా తనకు సంతోషాన్ని కలిగిస్తోందనీ, అయినా, 'ఓ బేబీ'లో తనది మొదట్లో గెస్ట్ రోల్ అనుకున్నా, సెట్లో అడుగు పెట్టాక, ఫుల్ లెంగ్త్ రోలే అయ్యిందని నాగశౌర్య తెలిపారు.