గత 40 రోజులుగా బుల్లితెర వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న బిగ్బాస్ షోలోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రిని హౌస్లోకి పంపి రచ్చ రచ్చ చేయించిన సంగతి తెలసిందే. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీపై గత కొంత కాలంగా రకరకాల ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్ శ్రద్ధా దాస్, తెలుగమ్మాయ్ ఈషా రెబ్బల్లో ఎవరో ఒకరు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనేది ఈ ప్రచారంలో సారాంశం.
కానీ, ఆ ఇద్దరూ కాదు, ఒకప్పటి ప్రముఖ యాంకర్, మంచి మాటకారి అయిన శిల్పా చక్రవర్తిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపించారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని కొత్తగా డిజైన్ చేశారు. కన్ఫెషన్ రూమ్లో మిస్టరీ ఫ్రెండ్గా పరిచయం చేశారు. ఇద్దరిద్దరు హౌస్మేట్స్ చొప్పున కన్ఫెషన్ రూమ్కి పిలిచి హౌస్లో వారు లీడ్ చేస్తున్న తీరును వారి చేతనే చెప్పించి, ఆయా లోపాలను మిస్టరీ ఫ్రెండ్ నోటితో చెప్పించి తదుపరి నామినేషన్ ప్రక్రియ జరిపారు.
ఇలా మిస్టరీ ఫ్రెండ్ ఎంట్రీనే కాదు, నామినేషన్ ప్రక్రియ కూడా వైరైటీగా జరిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తి ఆధ్వర్యంలో. ఫైనల్గా నామినేషన్ ప్రక్రియ ముగిసినాక, మిస్టరీ ఫ్రెండ్ ఎవరనే విషయాన్ని హౌస్మేట్స్కి రివీల్ చేశారు. అయితే, జ్యోతక్క ఆల్రెడీ ఆ మిస్టరీ ఫ్రెండ్ గొంతును బట్టి ఆమె ఎవరై ఉంటారనే విషయాన్ని గెస్ చేసేసింది. శ్రీముఖి కూడా కనిపెట్టేస్తుందని ముందే ఊహించిన మిస్టరీ ఫ్రెండ్ (శిల్పా చక్రవర్తి), శ్రీముఖి టర్న్లో గొంతు మార్చి మాట్లాడడం మరో బిగ్ మలుపు.