అభిమానులందు దురభిమానులు వేరయా.. అని పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఓ అద్భుతమైన అప్డేట్ని గిఫ్ట్గా ఇవ్వాలని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 8 ఉదయం అప్డేట్ వస్తుందని ప్రకటించారు నిర్మాతలు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్న హీరోయిన్గా నటిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడింది. లేకపోతే, కేరళలో ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణలో వుండేది.
ఇదిలా వుంటే, తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులు, ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించడం మామూలే. ఇదే అదనుగా చేసుకుని కొందరు దురభిమానులు, మైత్రీ మూవీ మేకర్స్పై అవాకులు చెవాకులు పేలుతున్నారు సోషల్ మీడియా వేదికగా. దాంతో, మైత్రీ మూవీ మేకర్స్ ఒకింత ఆందోళనకు గురవుతోంది. అభిమానుల్ని ఉద్దేశించి ‘రిక్వెస్ట్’ చేస్తూ ట్వీట్లు వేస్తోంది. తాము చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా, కొందరు పనిగట్టుకుని ‘ట్రోల్’ చేయడం పట్ల నిర్మాతలు అసహనానికి గురవుతున్నారట. సినిమా నిర్మాణం ఆలస్యమైతే నిర్మాతలకే నష్టం. తమ సినిమా ప్రమోషన్స్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాలని ఎవరు మాత్రం అనుకోరు.? ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్ని అభిమానులూ అర్థం చేసుకోవాల్సిందే మరి.