మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న జరిగిన అంతరిక్షం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన సంగతి మనకి తెలిసిందే. సినిమా ఈవెంట్స్ లో ఒకరిని పొగడబోయి వాళ్ళే విమర్శల్లో పడుతుంటారు మన హీరోలు. అయితే, అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో తీవ్రవిమర్శలు వస్తున్నాయి. ఈ ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతూ ముగ్గురు డైరెక్టర్లని ఆకాశానికి ఎత్తేశాడు.
'సినిమా ఇండస్ట్రీలోనైనా రాజకీయాల్లోనైనా ఎక్కడైనా గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉంటారు. అలాంటి గొప్ప ఆలోచనలున్న డైరెక్టర్స్ లో రాజమౌళి గారు, సుకుమార్ గారు మరియు క్రిష్ గారు ముఖ్యులు. ఆ జాబితాలో సంకల్ప్ కూడా రావాలని, వాళ్ళ కన్నా గొప్ప స్థాయిలోకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని' చరణ్ మాట్లాడాడు. ఈ మాటలు ఎంతో వినసోంపుగా ఉన్నా తెలుగు ఇండస్ట్రీలో ఆ ముగ్గురు తప్ప ఇంకెవ్వరు మంచి డైరెక్టర్స్ లేరా అనే విమర్శలకు తావునిచ్చాయి.
సాధారణంగా చాలా మంది పెద్ద హీరోలు ప్రస్తుతం తమ సినిమాలకు పని చేస్తున్న దర్శకులను, భవిష్యత్తులో తాము పనిచేయాలనుకుంటున్న దర్శకులని మాత్రమే గుర్తుంచుకుని మిగతా వారిని మర్చిపోతుంటారు. అలాగే, రామ్ చరణ్ మాటలు కూడా ఇదే ఫార్ములాని సూచిస్తున్నాయి. రంగస్థలంతో మంచి హిట్ ఇచ్చిన సుకుమార్ గొప్ప దర్శకుడు. గతంలో మగధీర చేసి, ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాలు చేస్తున్నారు కాబట్టి రాజమౌళి గొప్పవాడు. ఇక క్రిష్, స్టేజీపై ఉన్నాడు మరియు గతంలో తమ్ముడికి కంచె సినిమా ద్వారా హిట్ ఇచ్చాడు.
ఇలా ఉన్నతమైన ఆలోచనలు ఉన్న దర్శకులు అంటూ ఆ ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పడంలో చరణ్ ఉద్దేశం ఏంటి అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. ముందు తరం డైరెక్టర్ల పేర్లు గుర్తుండకపోయినా, కనీసం నేటి తరం వారి పేర్లు చెప్పాలన్న చాలా మందే ఉన్నారు. అలాకాకుండా 'గొప్ప ఆలోచనలున్న దర్శకులు' అన్న టైటిల్ చరణ్ ఆ ముగ్గిరికే ఇవ్వటం ఆశ్చర్యకరంగా మారింది... ఇకపోతే, రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం "వినయ విధేయ రామ" సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.