ఇదంతా వెబ్ సిరీస్ల జమానా. ఓటీటీ వేదికలు - అందులోని వెబ్ సిరీస్లే ఇప్పుడు జనాలకు కాలక్షేపం. వాటి విలువ అందరికీ అర్థమైంది. రాబోయే రోజుల్లో చిత్రసీమని వెబ్ సిరీస్లు ఆక్రమించుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే స్టార్లు సైతం వెబ్ సిరీస్లపై దృష్టి పెడుతున్నారు. వెబ్ సిరీస్ల ప్రాముఖ్యతని మెగాస్టార్ చిరంజీవి కూడా గుర్తించారు. ఈ లాక్ డౌన్ సమయంలో తాను కూడా వెబ్ సిరీస్లు చూస్తున్నానని, సినిమాలకు ఇదో ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని, నటీనటులలో కొత్త కోణాల్ని ఆవిష్కరించుకొనే అవకాశం దక్కుతుందని చిరు ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఓ వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఈ వెబ్ సిరీస్ `ఆహా` కోసమే అని తేలింది. కొణిదెల ప్రొడక్షన్స్ పై చిరంజీవి ఈ వెబ్ సిరీస్ని నిర్మిస్తారు. అయితే ఇందులో చిరు నటిస్తారా, లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే చిరంజీవి కుమార్తెలు ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని మాత్రం తెలుస్తోంది. వెబ్ సిరీస్ పూర్తయ్యాక అల్లు అరవింద్ నిర్వహిస్తున్న `ఆహా` ఓటీటీ ఛానల్కి ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఎలాంటి కథ చెయ్యాలి? అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని టాక్.