లాక్ డౌన్ వల్ల చిత్రసీమ స్థంభించిపోయింది. ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయాయి. దాంతో.. కార్మికులకు పనిలేక నానా అవస్థలూ పడుతున్నారు. వీళ్లని ఆదుకోవడానికి ఏర్పాటైందే.. సీసీసీ. దీని ద్వారా ఉపాధి కోల్పోయి, అల్లాడుతున్న కార్మికుల్ని ఆదుకోవాలని చిత్రసీమ నిర్ణయించింది. చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్ గత నెలలో కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని అందించింది.
ఇప్పుడు మరో దఫా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినిమా పరిశ్రమలో చాలారకాలైన యూనియన్లు ఉన్నాయి. వాటి ద్వారానే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. యూనియన్ సభ్యులందరికీ సరుకులు పంపిణీ చేయాలని తొలుత భావించినా, ఆ తరవాత ఎంపిక చేసిన సగం మందికే, సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దాంతో కార్మికుల నుంచి నిరసన వ్యక్తమైంది. గత మూడు నెలలుగా పనులు లేక ఖాళీగా ఉన్నామని, ఇంట్లో పూట గడవడం కష్టంగా మారిందని, ఇలాంటి సమయంలో సీసీసీ తమని ఆదుకోవాల్సింది పోయి, సగం మందికే ఇస్తామని చెప్పడం పక్షపాత ధోరణే అని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాలన్నీ చిరంజీవి దృష్టికి వెళ్లాయి కూడా. కార్మిక సంఘాల్లో మెంబర్ షిప్ లేనివాళ్లు సైతం నిత్యావసర వస్తువులు కావాలని పట్టుపడడం, ఎక్కడా లెక్కా పత్రం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. ఇవన్నీ చిరంజీవికి కొత్త తలనొప్పుల్ని తీసుకొస్తున్నాయి. చిరంజీవి మాత్రం అర్హులైన అందరికీ సీసీసీ ద్వారా నిత్యావసర వస్తువులు అందించాల్సిందేనని గట్టిగా చెప్పార్ట. దానికి తగ్గట్టే ఏర్పాట్లూ జరుగుతున్నాయి. మరి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో?