మెగాస్టార్ చిరంజీవికి నందమూరి బాలకృష్ణ అత్యంత సన్నిహితుడు. అభిమానుల మధ్య గొడవలెలా వున్నా, ఇద్దరి మధ్యా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అనేక విషయాలు చర్చించుకుంటుంటారు. ఒకరింటికి ఇంకొకరు వెళుతుంటారు.. ఒకర్ని ఒకరు అభినందించుకుంటుంటారు పలు అంశాలకు సంబంధించి. కానీ, అభిమానులు మాత్రం ఎన్నో ఏళ్ళుగా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వున్నారు.. తమ తమ అభిమాన హీరోల మీద అభిమానం పేరు చెప్పి. ‘మేమంతా ఒక్కటే.. మీరూ మమ్మల్ని చూసి నేర్చుకోండి..’ అని ఇద్దరు హీరోలూ ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు మారరుగాక మారరు.
కరోనా వైరస్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కోటి పాతిక లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తే, ‘థ్యాంక్యూ డియర్ బ్రదర్ బాలయ్యా..’ అని అభినందించారు చిరంజీవి. ‘ప్రజలకు ఏ కష్టమొచ్చినా నువ్వెప్పుడూ ముందుంటావ్..’ అని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు బాలయ్యను ఉద్దేశించి. బాలయ్య అభిమానుల ముసుగులో కొందరు చిరంజీవిపై అర్థం పర్థం లేని విమర్శలు షురూ చేశారు. అయితే, బాలయ్యను అభిమానించే మెజార్టీ అభిమానులు మాత్రం, ‘వాళ్ళిద్దరి మధ్యా మంచి స్నేహ సంబంధాలున్నాయి.. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు.. మీరసలు బాలయ్య అభిమానులే కాదు..’ అంటూ సదరు హేటర్స్పై సోషల్ మీడియాలోనే విరుచుకుపడుతున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం విదితమే. బాలయ్య ప్రకటించిన కోటి పాతిక లక్షల మొత్తంలో చెరో యాభై లక్షలు తెలుగు రాష్ట్రాలకీ, 25 లక్షలు కరోనా క్రైసిస్ ఛారిటీకి కేటాయించారు.