ఏప్రిల్ 14 వరకూ దేశంలో లాక్ డౌన్ నడుస్తుంది. అంతా ఇళ్లు దాటి బయటకి రావడం కుదరదు. ఏం చేసినా ఇంట్లోనే. సామాన్యుడి నుంచి స్టార్ హీరో వరకూ అందరిదీ ఇదే పరిస్థితి. రోజూ సినిమాలూ, షూటింగులూ అంటూ పరుగులు తీసే స్టార్లు ఇప్పుడు ఎలా గడుపుతున్నారు అనే ఆసక్తి నెలకొంది. కొంతమంది వంటలు చేస్తూ, ఇంకొంతమంది పుస్తకాలు చదువుతూ, మరికొంతమంది పాత సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి లాక్ డౌన్ వేళ మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తున్నారు? ఆయన కాలక్షేపం వేటితో..? లాక్ డౌన్ సమయంలో అందరికంటే ముందుగా స్పందించిన సెలబ్రెటీ చిరంజీవినే.
`ఆచార్య` షూటింగ్ని ముందస్తుగా ఆపేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే ఉద్యోగులకు ముందుగా జీతాలు చెల్లించేసి, ఇంటిపట్టునే ఉండమని చెప్పారట చిరు. ఎప్పటి నుంచో తమ ఇంట్లో పనిచేస్తున్నవాళ్లు మాత్రం ఇప్పుడు చిరు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లూ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటుగా స్వీయ నిర్బంధం పాటిస్తున్నార్ట.
ఈ లాక్ డౌన్ సమయంలో చిరు ఆత్మ కథ రాసుకుంటున్నారు. ఎప్పటి నుంచో తనకు ఆత్మకథ రాసుకోవాలని ఉందని, దానికి ఇప్పుడు సమయం కేటాయిస్తున్నానని చెప్పారు చిరు. రోజుకు రెండు సార్లు వ్యాయామం చేస్తున్నానని, పాత సినిమాలు చూస్తున్నానని, మొక్కలకు నీళ్లు వేస్తూ కాలక్షేపం చేస్తున్నానని చిరు చెప్పుకొచ్చారు.