'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఇదో మలయాళం చిత్రం. అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఆ నమ్మకంతో సితార ఎంటర్టైన్మెంట్స్సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కుల్ని భారీ రేటు ఇచ్చి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఎవరు చేయబోతున్నారన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదో మల్టీస్టారర్ చిత్రం. మలయాళంలో బీజు మీనన్, ఫృథ్వీరాజ్ నటించారు. బీజూ మీనన్ పాత్ర బాలయ్యతో చేయిస్తే బాగుంటుందన్నది ఆలోచన. ఫృథ్వీరాజ్ పాత్రకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే.. ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది మరో ప్రధానమైన ప్రశ్న. బి.గోపాల్ చేతిలో ఈ సినిమా పెడతారన్న వార్తలు వినవస్తున్నాయి.
అయితే అది అసాధ్యం. ఎందుకంటే.. బి.గోపాల్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ఇలాంటి సబ్జెక్టులను ఆయన డీల్ చేయలేడు కూడా. ఈ సినిమాని ఓ స్టార్ డైరెక్టర్ చేతిలో పెడితేనే న్యాయం జరుగుతుందని నిర్మాత భావిస్తున్నారు. ఆ డైరెక్టర్ త్రివిక్రమ్ అయ్యే ఛాన్సుందని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే సితార ఎంటర్టైన్మెంట్స్తో త్రివిక్రమ్కి మంచి అనుబంధం ఉంది. ఓరకంగా ఇది తన ఓన్ బ్యానర్.ఈ మలయాళ రీమేక్ కొనమని సలహా ఇచ్చింది కూడా త్రివిక్రమేనట. అందుకే.. ఆయనే ఈ సినిమాకి కరెక్ట్ అని నిర్మాత భావిస్తున్నాడు. కానీ... త్రివిక్రమ్ ఇప్పటి వరకూ రీమేక్ చేయలేదు. చేసే ఉద్దేశ్యాలు కూడా ఆయనకు లేవు. అందుకే.. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉన్నాడు. అయితే.. తను ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి. ఆర్.ఆర్.ఆర్ పూర్తయ్యే వరకూ ఎన్టీఆర్ త్రివిక్రమ్కి అందుబాటులో లేకపోవొచ్చు. అలా ఓ పెద్ద గ్యాప్ వస్తే త్రివిక్రమ్ ఆ గ్యాప్ లో ఈ సినిమా చేసినా ఆశ్చర్యం లేదు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం త్రివిక్రమే.