సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కించింది. టాక్ కాస్త అటూ ఇటుగా ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం 'చిత్రలహరి' ఆకట్టుకుంది. తొలి రోజు రూ.3 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో మరో 4.75 కోట్లు సాధించి బయ్యర్లు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మొత్తానికి మూడు రోజుల్లోనూ 7.75 కోట్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి దాదాపు 10 కోట్ల బిజినెస్ జరిగింది. బయ్యర్లు తమ పెట్టుబడిని తిరిగిరాబట్టుకోవాలంటే... వీక్ డేస్లో కూడా 'చిత్రలహరి' నిలబడాలి.
శుక్రవారం వరకూ కనీసం 50 శాతం రెవిన్యూతో 'చిత్రలహరి' సాగినా... బయ్యర్లు సేఫ్ జోన్లో పడిపోయినట్టే. నైజాంలో 3.15 కోట్లకు ఈ సినిమా కొన్నారు. ఇప్పటికి 2.53 కోట్లు వచ్చాయి. సీడెడ్లో 1.70 కోట్లకు కొంటే ఇప్పటి వరకూ 1.30 కోట్లు వచ్చాయి. ఇలా దాదాపు అన్ని ఏరియాల్లోనూ 60 నుంచి 70 శాతం రికవరీ అయిపోయాయి. ఆ మిగిలిన మొత్తం ఎన్ని రోజుల్లో వస్తుందన్న దాన్ని బట్టి బయ్యర్లు సేఫా? కాదా? అనేది తేలిపోతుంది.
వచ్చే వారం 'జెర్సీ', 'కాంచన 3' విడుదల అవుతున్నాయి. ఈలోగా వీలైనన్ని వసూళ్లు తెచ్చుకుని, ఈ సినిమాని గట్టెక్కించాల్సిన బాధ్యత నిర్మాతలపైనే ఉంది. అందుకే... వాళ్లు కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు.