బుల్లితెరపై ప్రసారమవుతున్న మెగా రియాల్టీ షో 'బిగ్బాస్' వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. షోలో పిచ్చి పిచ్చి టాస్క్లు జరుగుతున్నాయంటూ ఓ న్యాయవాది బిగ్బాస్ షోపై కోర్టునాశ్రయించాడు. బిగ్హౌస్లో కంటెస్టెంట్స్ని బంధించారు. అది మానవ హక్కుల ఉల్లంఘన. దాంతో పాటుగా సభ్య సమాజానికి చెడు సంకేతాలు పంపేలా కంటెస్టెంట్స్తో జుగుప్సాకరమైన పనులు చేయిస్తున్నారు అని ఆయన ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన 'బిగ్బాస్' మొదటి సీజన్లో ఇలాంటి వివాదాలు ఎప్పుడు నమోదు కాలేదు. చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమే. కానీ రియాల్టీ షో అన్నాక అలాంటివి మామూలే. అయితే నాని హోస్ట్గా నడుస్తున్న ఈ సీజన్ మాత్రం మొదట్నుంచీ వివాదాలకు కేంద్రబిందువవుతోంది. అన్నింటికీ మించి ఆడియన్స్ నుండి కూడా కంప్లెయింట్స్ ఎక్కువవుతున్నాయి. వ్యక్తిగత కుట్రలు, కుతంత్రాలతో కంటెస్టెంట్స్ పర్సనల్ టార్గెట్స్ అవుతున్నారు. టాస్క్లకు సంబంధించి మాత్రమే కాదు, ఇతర వ్యవహారాలకు సంబంధించి కూడా హౌస్ నుండి రకరకాల కంప్లెయింట్స్ వస్తున్నాయి.
అయితే ఈ వివాదాలు రియాల్టీ షో నిర్వాహకులకు ఇబ్బంది కలిగిస్తాయో లేదో తెలీదు కానీ, నేచురల్ స్టార్ నానికి మాత్రం చాలా బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెడుతోంది. ఎన్టీఆర్ తర్వాత ఈ షోని నడిపే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే అంశంపై పలు చర్చలు జరిగాయి. కానీ చిట్టచివరికి ఆ ఛాన్స్ నానిని వరించింది.
కానీ ఎందుకో నానికి ఈ అవకాశంతో పెద్దగా ఒరిగేదేమీ లేదనిపిస్తోంది. నటుడిగా ఎన్టీఆర్ వెండితెరతో పాటు, బుల్లితెరపై కూడా విశ్వరూపం చూపించాడనే కామెంట్స్ వచ్చాయి. కానీ నాని విషయంలో అది రివర్స్ అయిపోతోంది. తనకున్న గుడ్ ఇమేజ్ కాస్తా బ్యాడ్ అయిపోతోందనిపిస్తోంది.