కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి ఆ తమిళ అగ్ర హీరో పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ ఎవరా తమిళ హీరో అనుకుంటున్నారా? విలక్షణ నటుడు విక్రమ్. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘వర్మ’ అను సినిమా తెరకెక్కింది. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’కి ఇది రీమేక్గా రూపొందిన సంగతి తెలిసిందే. అయితే, సినిమా మొత్తం పూర్తయ్యాకా, అవుట్ పుట్ బాగోలేదనే కారణంతో సినిమాలో కొన్ని కొన్ని కీలక మార్పులు చేయాలని డైరెక్టర్కి సూచించారట నిర్మాతలు. బాలా అంతటి సీనియర్ డైరెక్టర్కి అది నచ్చకపోవడంతో, మార్పులకు ఒప్పుకోలేదు. దాంతో నిర్మాతలు బాలా తీసిన కంటెంట్ పూర్తిగా పక్కన పెట్టేసి, కొత్త డైరెక్టర్ గిరి శయ్యతో మళ్లీ మొదట్నుంచీ సినిమా తెరకెక్కించారు.
‘ఆదిత్య వర్మ’ టైటిల్తో సినిమాని రీ షూట్ చేశారు. ఎలాగోలా సినిమా రిలీజైంది. కానీ, ఎప్పుడు రిలీజైందో కూడా తెలియకుండానే వెళ్లిపోయింది. అసలు వివరాల్లోకి వెళితే, బాలా తెరకెక్కించిన వెర్షన్ని ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తాజా కోలీవుడ్ టాక్. అప్పట్లో నిర్మాతల వైఖరికి చాలా అవమాన పడ్డాడు డైరెక్టర్ బాల. అలాంటిది ఇప్పుడు మళ్లీ తన సినిమాని రిలీజ్ చేస్తామంటే ఒప్పుకుంటాడా? చూడాలి మరి. ‘వర్మ’ అనే టైటిల్తో బాల వెర్షన్ తెరకెక్కింది. ఈ వెర్షన్లో మేఘా చౌదరి హీరోయిన్గా నటించింది. చూడాలి మరి, ‘వర్మ’ నుండి ‘ఆదిత్య వర్మ’కు, మళ్లీ ‘ఆదిత్య వర్మ’ నుండి ‘వర్మ’కు మారిన ధృవ్ డెబ్యూ మూవీ కథ ఏ కంచికి చేరుతుందో.