ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ బయటకి వచ్చేయడంతో ఒక్కసారిగా ఈ చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏ దర్శకుడు తెరకేక్కిస్తడు అన్న దాని పైన చర్చోపచర్చలు మొదలయ్యాయి.
ముఖ్యంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించేందుకు ఒక నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అందులో ముందుగ వినిపించే పేరు- కృష్ణవంశీ. ఈయన గతంలో బాలకృష్ణతో రైతు అనే చిత్రాన్ని తీయవలసి ఉండగా అది కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాలెక్క లేదు. ఇక ఇప్పుడు ఈ అవకాశం ఈయనని వరించ వచ్చు.
రెండవ పేరుగా దర్శకుడు క్రిష్ పేరు వినిపిస్తున్నది. బాలకృష్ణతో ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తీసి విజయవంతం చేయడంతో ఈయన పేరు ఈ జాబితాలోకి వచ్చింది.
ముచ్చటగా మూడవ పేరు పూరి జగన్నాధ్. సినిమాని చాలా వేగంగా అదే సమయంలో క్వాలిటీ తగ్గకుండా చిత్రాన్ని తీస్తాడు అన్న పేరున్న దర్శకుడు. పైసా వసూల్ వంటి కమర్షియల్ చిత్రాన్ని బాలకృష్ణతో తీసి ఉండడం ఈయనకి కలిసొచ్చే అంశం.
చివరగా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే దర్శకుడు రాఘవేంద్రరావు. ఈయన అనుభవమే ఈయనకి అతిపెద్ద ప్లస్. ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఉండడంతో పాటుగా ఆయన జీవితాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా మంచి గుర్తింపు కూడా ఉంది.
ఇక ఈ నలుగురిలో ఒకరిని ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించేందుకు బాలయ్య తీసుకుంటాడు అని ఇవ్వని కాకపోతే ఆయనే స్వయంగా రంగంలోకి దిగి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని బాలయ్య పూర్తి చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.