ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజులగా ఓ మాస్ మసాలా సినిమా కోసం కరువెక్కిపోయి ఉన్న ఆడియన్స్కి జబర్దస్త్ మాస్ సినిమా పూరీ - రామ్ రూపంలో 'ఇస్మార్ట్ శంకర్'గా రూపుదిద్దుకుని వచ్చింది. దాంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, హీరో రామ్కి రావాల్సిన మొత్తాన్ని ప్రొడ్యూసర్లు ఇవ్వలేదనే నెపంతో, కొత్త అల్లుడిలా రామ్ అలకబూనాడనీ, ఆ అలకతోనే ప్రమోషన్స్లో పాల్గొనడం లేదనీ, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడనే గాసిప్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ గాసిప్పై రామ్ తాజాగా స్పందించాడు. 'సినిమా ప్రమోషన్స్లో తాను పాల్గొనడం లేదన్న గాసిప్లో ఎంతమాత్రమూ నిజం లేదు. సినిమాకి నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. ప్రొడ్యూసర్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ గాసిప్స్ అంతా ఉత్తదే..' అని రామ్ వివరణ ఇచ్చాడు. అంతేకాదు, 'ఇలాంటి గాసిప్స్ చాలా సహజం. మామూలుగా అయితే, ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ, వీటిని ఇలాగే వదిలేస్తే, ఇంకెంత దూరం పోతాయో అని స్పందించాల్సి వచ్చింది..' అంటూ రామ్ సోషల్ మీడియాలో ట్వీటాడు.
రామ్ రెస్పాన్స్తో ఈ గాసిప్స్కి చెక్ పడుతుందేమో చూడాలిక. ఈ సినిమాకి పూరీ జగన్నాధ్, ఛార్మి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్ బ్యానర్లో పూరీ, ఛార్మి ఈ సినిమాని రూపొందించారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ఇస్మార్ట్ శంకర్'.