వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని రంగంలోకి దింపుతోంది చిత్రబృందం.
నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘మా ‘గని’ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే నెక్ట్స్ షెడ్యూల్కు సంబంధించిన చిత్రీరణను స్టార్ట్ చేస్తాం. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రం. వరుణ్ తేజ్ ఈ లాక్డౌన్ సమయంలోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో వరుణ్గారు, ఇతర ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలు సహా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇందు కోసం ఆర్ట్ డైరెక్టర్ భారీ స్టేడియం సెట్ను కూడా వేశారు. అలాగే హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో ఈ షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ చేస్తాం. ఈ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసిన తర్వాత రిలీజ్ డేట్కు సంబంధించిన ప్రకటన చేస్తాం’’ అన్నారు.