పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని సినిమాలవైపుకు వద్దామనుకుంటున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. అందులో క్రిష్ సినిమా ఒకటి. ఇదో పిరియాడికల్ డ్రామా అనే కబురు ముందే బయటకు వచ్చేసింది. ఇప్పుడు మరో లీక్ దొరికింది. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రేమిటన్నది తెలిసిపోయింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దొంగ గా అవతారం ఎత్తుతున్నాడట.
ఇది మహమ్మదీయుల కాలానికి సంబంధించిన కథ. అంటే దాదాపు 700 ఏళ్లక్రితం కథన్నమాట. అప్పట్లో దారి దోపిడీ దొంగలు ఎక్కువగా ఉండేవారు. అలాంటి పాత్రనే పవన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. బాలీవుడ్ నుంచి వాళ్లను దిగుమతి చేయాలని చూస్తున్నారు. 2020 ప్రధమార్థంలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.