ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా... `ఆది పురుష్`. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. మరి సీత పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైంది. కొత్త అప్ డేట్లు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ కూడా మొదలైంది. కానీ.. సీత ఖరారు కాలేదు. సీతగా చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. అనుష్క నుంచి కీర్తి సురేష్, కైరా అద్వాణీ వరకూ అంతా స్టార్ హీరోయిన్లే. అయితే.. ఇప్పుడు చిత్రబృందం షాక్ ఇచ్చింది.
ఈ సినిమాలో సీతగా కృతి సనన్ ని ఎంచుకుంది. వన్ నేనొక్కడినే, దోచేయ్ సినిమాల్లో కృతినే హీరోయిన్. ఆ రెండు సినిమాలూ వర్కవుట్ అవ్వకపోవడంతో కృతికి తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగు సినిమా మర్చిపోయిన.. కథానాయికని.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా, అందులోనూ సీతగా తీసుకోవడం ప్రభాస్ అభిమానుల్ని సైతం ఆశ్చర్యపరిచే విషయమే. స్టార్ హీరోయిన్లని సైతం పక్కన పెట్టి, కృతిని ఎంచుకోవడం... విస్మయాన్ని గురి చేస్తోంది. మరి ఈ పాత్రకి కృతి ఎంత వరకూ న్యాయం చేస్తుందో చూడాలి.