రజనీకాంత్ నటించిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. పి.వాసు దర్శకుడు. రజనీ పాత్రలో లారెన్స్ కనిపించబోతున్నాడు. ఇదేమంత పెద్ద విశేషం కాకపోవొచ్చు. కానీ ఈ సినిమా కోసం లారెన్స్ తీసుకున్న రూ.3 కోట్లనీ.. కరోనాపై పోరాటానికి విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నాడు లారెన్స్. అదీ... అసలు సిసలైన విశేషం.
అవును.. ఈ సినిమా కోసం అందుకున్న రూ.3 కోట్లని విరాళంగా ఇచ్చేశాడు లారెన్స్. అందులో 50 లక్షలు తమిళనాడు ప్రభుత్వానికీ, మరో 50 లక్షలు ప్రధాన మంత్రి సహాయ నిధికీ, 75 లక్షలు తన సొంత ఊరి కోసం, 25 లక్షలు డాన్సర్ల సంఘానికీ అందించబోతున్నాడు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ ద్వారా తెలియపరిచాడు. తమిళనాట బోలెడంత మంది సూపర్ స్టార్లున్నారు. రజనీకాంత్, అజిత్, విజయ్.. వీళ్లంతా కోట్లకు కోట్లు సంపాదించారు. కానీ ఏ ఒక్కరూ విరాళం విషయంలో లారెన్స్ దరిదాపుల్లో కూడా రాలేదు. రూ.3 కోట్లతో వాళ్లందరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు లారెన్స్.