అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి చేసే పబ్లిసిటీ స్టంట్లు కొంప ముంచేస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. 'భరత్ అనే నేను' సినిమా టైమ్లో ఆల్ టైమ్ గ్రాస్ రికార్డ్.. అంటూ 233 కోట్ల ఫిగర్ని పోస్టర్ మీద వేసి ప్రచారం చేసుకున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఇప్పుడు 'మహర్షి' సినిమా కొత్త పోస్టర్ మీద, 'ఆల్ టైమ్ గ్రాస్ రికార్డ్' అని ప్రకటించారు.
'మహేష్ గత సినిమాల రికార్డ్ని ఒక్క వారంలోనే మహర్షి' దాటేశాడన్నది కొత్త పోస్టర్ మీద రాతల సారాంశం. అంటే, అప్పుడే మహేష్ తన తాజా చిత్రం 'మహర్షి'తో 233 కోట్ల గ్రాస్ దాటేశాడనే కదా అర్థం. అభిమానులు సైతం ఇప్పుడు ఈ పోస్టర్ల ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'వాస్తవాలు ప్రచారం చేయండి ప్లీజ్' అంటూ సోషల్ మీడియా ద్వారా నిర్మాతల్ని వేడుకుంటున్నారు మహేష్ అభిమానులు. 'భరత్ అనే నేను' అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మహర్షి' కూడా అనూహ్య విజయాన్ని దక్కించుకుంది.
ఈ విజయాల్ని ఈ ఫేక్ ప్రచారాలు చిన్నవిగా చూపిస్తున్నాయనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయితే, అభిమానుల్ని ఉత్సాహపరచడానికే తప్ప, అసలు కథలు వేరేలా వుంటాయని పలు సందర్భాల్లో 'పెద్ద నిర్మాతలే' స్పష్టం చేశారు కాబట్టి, దీన్ని కూడా ఓ పబ్లిసిటీ స్టంట్లానే తీసుకోవాల్సి వుంటుంది. ఈ రచ్చ సంగతి పక్కన పెడితే, 100 కోట్ల (షేర్) వసూళ్ళ కోసం 'మహర్షి' అడుగులు వడివడిగా పడుతున్నాయ్. త్వరలోనే ఆ మార్క్ని 'మహర్షి' అందుకోబోతోంది.