ఆచార్య సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడన్న ఊహాగానాలకు చిరంజీవి తెర దించేశాడు. అసలు ఆ ఆలోచనే తమ బృందానికి రాలేదని తేల్చేశాడు. దాంతో చిరు - మహేష్ల ను ఒకేసారి వెండి తెరపై చూడాలన్న అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. నిజానికి చిరు - మహేష్ కలిసి నటిస్తారని నెల రోజుల క్రితమే ప్రచారం మొదలైంది. మహేష్ని కొరటాల శివ కలిశాడని, కథ కూడా చెప్పేశాడని, రోజుకి కోటి రూపాయల చొప్పున 30 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారని రకరకాల వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఇటు చిరంజీవి బృందం గానీ, అటు మహేష్ బాబు పీఆర్ టీమ్ గానీ ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎప్పుడైతే రెండు క్యాంపులూ కామ్ గా ఉన్నాయో, అప్పుడు ఈ వార్తకు మరింత బలం చేకూరింది.
చివరికి ఏమైందో తెలీదుగానీ, మహేష్ డ్రాప్ అవ్వడం, చరణ్ తోనే ఆ పాత్ర భర్తీ చేయాలనుకోవడం జరిగిపోయాయి. అంతా అయిపోయాక చిరు మెల్లగా `మహేష్ బాబు నటిస్తాడన్న వార్త ఎలా బయటకు వచ్చిందో తెలీదు` అనేశాడు. సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు మాట్లాడని చిరు, ఇప్పుడు మాత్రం తనకు తెలీదు అనడం విడ్డూరమే. మహేష్తో చిత్రబృందం సంప్రదింపులు జరిపిన మాట నిజమే అని, మహేష్ `నో` చెప్పేసరికి ఆ ఆలోచన విరమించుకున్నారని, అందుకే ఇప్పుడు చిరంజీవి తనకేం తెలీదన్నట్టు వ్యవహరిస్తున్నారని మహేష్ క్యాంపులో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో ఏం జరిగిందో అటు చిరుకీ, ఇటు మహేష్కే ఎరుక.