కథానాయికల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతమందిని దిగుమతి చేసినా.. హీరోయిన్ల లేటు తీరడం లేదు. సూపర్ స్టార్, మెగాస్టార్ సినిమాలకు సైతం ఈ బెడద ఉంది. హీరో, దర్శకుడి కాంబినేషన్ సెట్ అవ్వగానే చేస్తున్న మొదటి పని... హీరోయిన్ కోసం అన్వేషించడం. మహేష్ బాబు సినిమా కోసం కూడా ఆ సెర్చ్ ఎప్పుడో మొదలైపోయింది. మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
కథానాయికగా ఇప్పటి వరకూ చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. కీర్తి సురేష్, రష్మిక.. ఇలా స్టార్లందరి పేర్లూ చెప్పుకున్నారు. బాలీవుడ్ భామల పేర్లూ ప్రస్తావనకు వచ్చాయి. అయితే... వీళ్లలో ఎవ్వరూ ఇప్పటి వరకూ ఖరారు కాలేదట. మహేష్ సినిమాలో హీరోయిన్ ఫిక్సయ్యిందన్న వార్తల్లో నిజం లేదని, కథానాయికల వేట ఇంకా కొనసాగుతోందని చిత్రబృందం తేల్చి చెప్పింది. మహేష్ పక్కన స్టార్ హీరోయిన్ నటించడం ఖాయమని, అయితే ఆమె ఎవరన్నది ఇంకా తేలలేదని దర్శక నిర్మాతలు చెబుతన్నారు. లాక్ డౌన్ దృష్ట్యా... ఈనెల 14 వరకూ షూటింగులు లేవు. మహేష్ కూడా సినిమా మూడ్ లో లేడు. జూన్ నుంచి ఈ సినిమాకి కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈలోగా హీరోయిన్ని పట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు.