సూపర్ స్టార్ మహేష్బాబు త్వరలో తన కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ‘గీతగోవిందం’ ఫేం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అయితే, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన తదుపరి సినిమాకి దర్శకుడు వంశీ పైడిపల్లి.. అని ప్రకటించేశాడు మహేష్బాబు. దాంతో అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది.
అయితే, ఈ మొత్తం కన్ఫ్యూజన్పై అతి త్వరలో క్లారిటీ ఇచ్చేయబోతున్నాడట మహేష్బాబు. ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాల్ని మహేష్ త్వరలో ప్రకటించబోతున్నాడనే ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతోంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో అదే రోజున, మహేష్ నుంచి రెండు ప్రకటనలు రాబోతున్నాయంటున్నారు. అయితే, అనౌన్స్మెంట్స్ ముందుగానే జరిగిపోతాయనీ, ఆ రోజు లాంఛనంగా రెండు సినిమాల ప్రారంభోత్సవం జరిగే అవకాశముందనీ టాలీవుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. పరశురామ్ తో సినిమా చేస్తూనే, వంశీ పైడిపల్లితోనూ సినిమా చేయాలని మహేష్ నిర్ణయానికి వచ్చాడన్నది తాజా గుసుగసల సారాంశం.
పరశురామ్ సినిమా నిర్మాణం చాలా వేగంగా పూర్తయిపోతుందనీ, వంశీ పైడిపల్లితో సినిమాకి మాత్రం కాస్త సమయం పట్టొచ్చనీ తెలుస్తోంది. ఏమో, మహేష్ నుంచి ఇంకా షాకింగ్ ప్రకటన ఏదైనా ఈలోగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.