బాలీవుడ్ చిత్రం 'మణికర్ణిక'ని వివాదాలు వదలట్లేదు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసి, 'ఎన్టీఆర్' ప్రాజెక్ట్ కోసం ఆయన టాలీవుడ్కొచ్చేశారు. అయితే ఆయన ఆ సినిమాని వదిలిపెట్టిన తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ నిమిత్తం డైరెక్షన్ బాధ్యతను హీరోయిన్ కంగనా తన చేతుల్లోకి తీసుకుంది. అక్కడి నుండే వివాదాలు స్టార్ట్ అయ్యాయి. బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో కాంట్రవర్సీలతో కూడా అంతే పాపులర్ అయ్యింది.
కంగనాతో సినిమా అంటే పెద్ద తలనొప్పి అనే వాదన ఉంది. అన్నింట్లోనూ వేలు పెట్టేస్తుందనే రూమర్ కూడా ప్రచారంలో ఉంది. అలాగే 'మణికర్ణిక' విషంయలోనూ జరిగిందనీ, దాంతో క్రిష్ కావాలనే ఆ సినిమా డైరెక్షన్ నుండి తప్పుకున్నాడనీ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదంటూ కంగనా తర్వాత వివరణ ఇచ్చుకుంది కూడా. రీ షూట్స్ జరుగుతున్నాయనీ, నిర్మాతల్ని ఇబ్బంది పెడుతోందనీ.. ఇలా ఒక్కటేమిటి రకరకాల గాసిప్స్ వివాదాల రూపంలో ఈ సినిమాని వెంటాడుతూనే ఉన్నాయి.
తాజాగా సినిమా కోసం పని చేసిన జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా గుస్సా అవుతున్నారట. చిత్రీకరణను ఆపేస్తామంటూ ఆందోళన చేస్తున్నారట. తమకు రావల్సిన డబ్బులు సమయానికి రావట్లేదనీ చిత్ర యూనిట్ వర్కర్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ని ఆశ్రయించారట. ఇదో కొత్త వివాదం. ఇలా వివాదాల నడుమ సావాసం చేస్తూ 'మణికర్ణిక' షూటింగ్ ఎలా జరుగుతోందో తెలీదు కానీ, సినిమా అయితే జనవరి 25కు విడుదల కావాల్సి ఉంది. మరి అడుగడుగునా వివాదాలు అడ్డుపెడుతుంటే మణికర్ణిక అనుకున్న టైంకి విడుదలయ్యేనా.? మరోవైపు క్రిష్ 'మణికర్ణిక'ను పూర్తిగా వదిలేశాడంటూ కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.