భారీ అంచనాల మధ్య విడుదలైన `మన్మథుడు 2` బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి దూరమయ్యారు. దాంతో... నష్టాలూ ఎక్కువయ్యాయి. దాదాపు ఈ సినిమాకి సగానికి సగం పోయే ఛాన్సుంది. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో మన్మథుడు ఆడుతూనే ఉంది. అయితే... అద్దె డబ్బులు కూడా రావడం లేదు. ఆగస్టు 15 సెలవు... మన్మథుడికి కాస్త కలిసొచ్చింది. కొన్ని ఏరియాలలో గురువారం టికెట్లు తెగాయి.
అయితే ఈ వారంతంలో మాత్రం ఎవరు, రణరంగం చిత్రాలకే ఎక్కువ వెసులుబాటు ఉంది. నైజాంలో ఈ సినిమాని 7 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకూ కనీసం మూడు కోట్లు కూడా రాలేదు. సీడెడ్లో రూ.2.5 కోట్లకు అమ్మారు. తొలి వారంలో 95 లక్షలు మాత్రమే రాబట్టింది. ఏపీ, తెలంగాణ కలిపి దాదాపు 16 కోట్లకు అమ్మితే.. ఇప్పటి వరకూ 7 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే.. 50 శాతానికి పైగానే నష్టాలు వాటిల్లాయన్నమాట.
అయితే ఈ ఏరియాలన్నీ కేవలం అడ్వాన్సులు తీసుకుని సినిమాని అమ్మారు. దాంతో ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ చూసిన భారీ ఫ్లాప్ ఇదే.