ఆర్.నారాయణమూర్తి ఎంత సింపుల్గా ఉంటారో, ఆయన సినిమాలకు సంబంధించిన వేడుకలూ అంతే సింపుల్గా సాగుతుంటాయి. స్టార్లని అతిథులుగా పిలవడం, వాళ్లతో ఆడియోలు ఆవిష్కరించుకోవడం నిజంగా నారాయణమూర్తికి తెలియని మార్కెటింగ్ సూత్రాలు. అయితే `మార్కెట్లో ప్రజాస్వామ్యం` ఆడియో వేడుకకు మాత్రం మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు నారాయణమూర్తి. చిరు రాకతో... ఈ సినిమాకి కాస్త గ్లామర్ వచ్చినట్టైంది. ఆడియో ఫంక్షన్లో చిరు ప్రవర్తించిన తీరు.. చూపరులను మరింత మంత్రముగ్థుల్ని చేసింది.
నారాయణమూర్తిలా మారిపోయిన చిరు, సింప్లిసిటీలో ఆయన్నే మించిపోయి.. అందరితో సెభాష్ అనిపించుకున్నాడు చిరు. సాధారణంగా ప్రెస్ మీట్లు నిర్వహించినప్పుడు మీడియా మిత్రుల కోసం అల్పాహారం ఏర్పాటు చేస్తుంటుంది చిత్రబృందం. అతిథులెవ్వరూ... స్నాక్స్ దగ్గరకు కూడా రారు. `మార్కెట్లో ప్రజాస్వామ్యం` ఆడియో ఫంక్షన్లోనూ పాత్రికేయుల కోసం స్నాక్స్ అందించారు.
ఆ సమయంలో చిరంజీవి అక్కడ ప్రత్యక్షమయ్యారు. మీడియా మిత్రులతో కలసి, స్నాక్స్ తీసుకున్నారు. నారాయణమూర్తి చిరుకి కొసరి కొసరి వడ్డించడం కూడా ఆకట్టుకుంది. మెగాస్టార్ అయ్యుండి మామూలు మనిషిలా అందరిలోనూ కలసిపోవడం సెభాష్ అనిపించుకుంది. ఈ ఛాయా చిత్రాలన్నీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా.