వరుస ఫ్లాపుల తర్వాత హిట్ ట్రాక్ ఎక్కిన నితిన్, మళ్ళీ వరుస ఫ్లాపులతో డీలాపడ్డాడు. ఈ టైమ్లో నితిన్కి మళ్ళీ లక్కు కలిసొచ్చేదెలా.? అన్న అభిమానుల ప్రశ్నకు సమాధానం దొరికినట్టే వుంది. లక్కీ బ్యూటీ రష్మిక మండన్నతో నితిన్ జతకడ్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్గా రష్మిక మండన్నని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
వెంకీ కుడుముల అంటే, 'ఛలో' సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు. నాగశౌర్య, రష్మిక ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెల్సిందే. 'ఛలో'ని మించిన హిట్ కోసం వెంకీ కుడుముల, ఆ సినిమా హీరోయిన్నే రిపీట్ చేస్తున్నాడనుకోవాలేమో. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా నితిన్ - రష్మిక కాంబినేషన్లో తెరకెక్కించనున్న సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ని అనుకుంటున్నారట. లవ్ స్టోరీనే అయినా, సినిమాలో బోల్డంత యాక్షన్ కూడా వుంటుందట.
'ఛల్ మోహనరంగ', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలు ఫర్వాలేదన్పించుకునే టాక్ సంపాదించుకున్నా, అంచనాల్ని అందుకోలేక చతికిలపడ్డాయి. ఈ టైమ్లో నితిన్, వెంకీ కుడుముల - రష్మికలతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలిక.