నితిన్ - రష్మికా మండన్నా జంటగా తెరకెక్కుతోన్న 'భీష్మ' సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇదిగో అదిగో అంటూ ఎప్పటి నుండో టాక్స్లో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అబ్బా.. ఇంకా పూజల దగ్గరే ఉందా.? అని ఫ్యాన్స్ మరోసారి నిరాశపడేలా చేశాడు నితిన్. అయితే ఈ నిరాశ నుండి కొంత ఊరటనిచ్చాడు రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసి. 'ఛలో'తో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది.
ఇంతకాలం లేట్ చేసి, ఫ్యాన్స్ని నిరాశలో పడేసిన నితిన్ ఇకపై స్పీడు పెంచనున్నాడట. రిలాక్స్ అవ్వకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నితిన్ భావిస్తున్నాడట. ఏది ఏమైతేనేం మొత్తానికి నితిన్ సినిమా పట్టాలెక్కింది. 'అ,ఆ' సినిమా తర్వాత సరైన హిట్ లేని నితిన్ ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టాలనుకుంటున్నాడు. కాంబో పరంగా చూస్తే, వెంకీ కుడుముల తొలి సినిమాకే 'ఛలో'తో హిట్ కొట్టాడు. సెంటిమెంట్ ప్రకారం తొలి సినిమా హీరోయిన్ రష్మికాని ఈ సినిమాకీ హీరోయిన్గా ఎంచుకున్నాడు. అన్నీ కలిసొచ్చి, రష్మిక, నితిన్కి అదృష్ట దేవత అవుతుందో లేదో చూడాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.