పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఘనంగానే జరిగింది. ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించారు. ఒకటి పింక్ రీమేక్ అయితే, రెండోది క్రిష్ సినిమా. ఇప్పుడు క్రిష్ సినిమాకి సంబంధించిన పవన్ కి ఓ కొత్త సమస్య వచ్చిపడింది. అదే బడ్జెట్ లెక్కలు.
ఈ సినిమా కోసం పవన్కి రూ.50 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. మరో 50 కోట్లలో సినిమా పూర్తి చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ యాభై కాస్త 80 కోట్లు అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి భారీ స్థాయిలో సెట్లు అవసరం అవుతున్నాయి. సెట్ల కోసమే కనీసం 30 కోట్లు కావాలని తెలుస్తోంది. పైగా స్టార్ కాస్టింగ్ కూడా పెద్దగానే ఉంది. కోరుకున్న నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ తీసుకోవాలంటే బడ్జెట్ని భరించాల్సిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి వీలైనంతగా బడ్జెట్ తగ్గించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించవచ్చో లెక్కలు వేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి హీరోయిన్ని తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ ని తీసుకొచ్చినా కనీసం 5 కోట్లు పారితోషికం ఇవ్వాలి. అందుకే ఇప్పుడు లోకల్ హీరోయిన్తో సరిపెట్టే ఆలోచనలో ఉన్నారు. సెట్ల విషయంలోనూ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నది క్రిష్ ప్లాన్. సో.. ఎలాగైనా వంద కోట్లలో ఈ సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట.