టాలీవుడ్లో మల్టీస్టారర్ కథలు వరుస కడుతున్నాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఒకే సినిమాలో కలిసి నటించడం.. మిగిలిన హీరోలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. ఈ దారిలో మరిన్ని సినిమాలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళం సినిమా `'అయ్యప్పనుమ్ కోషియుమ్` గనుక బాలకృష్ణ ఒప్పుకుంటే అది కూడా రీమేకే అవుతుంది. ఎందుకంటే ఇందులో బాలయ్యతో పాటు మరో కథానాయకుడి పాత్రకూ ఛాన్సుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్టు టాక్.
సుదీర్ఘ విరామం తరవాత `పింక్` తో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా ఒకదాన్ని తరవాత మరో సినిమాపై సంతకాలు చేసేస్తున్నాడు. నిర్మాత రామ్ తాళ్లూరికి పవన్ ఇది వరకే డేట్లు ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి గోపాల - గోపాల, కాటమరాయుడు ఫేమ్ డాలీ దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే ఇదో మల్టీస్టారర్ కథ అని తెలుస్తోంది. రెండో హీరోగా రవితేజని అనుకుంటున్నారట. `నేల టికెట్ ` ఆడియో ఫంక్షన్కి పవన్ కల్యాణ్క ముఖ్య అతిథిగా వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాత. పవన్తో రామ్కి మంచి అనుబంధం ఉంది. తనే ఈ ప్రాజెక్టు సెట్ చేసినట్టు టాక్. మరి ఈ వార్తే నిజమైతే... మరో సూపర్ డూపర్ కాంబినేషన్ సెట్ అయిపోయినట్టే.