అత్తారింటికి దారేది తరవాత పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం వెను వెంటనే పట్టాలెక్కాల్సింది. `కోబలి`పేరుతో ఓ సినిమా రాబోతోందని, రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఆ సినిమా సాగుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అదో ప్రయోగాత్మక చిత్రమని, వాణిజ్య అంశాలు ఏమాత్రం ఉండవని, ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పుకున్నారు. అయితే ఎందుకనో ఆ సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఆ తరవాత మళ్లీ పవన్ - త్రివిక్రమ్ కలిసినా.. కోబలి ముట్టుకోలేదు. అజ్ఞాతవాసి తో సరిపెట్టేశారు. ఇప్పుడు మరోసారి పవన్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది.
ఈసారైనా `కోబలి` స్క్రిప్టుని బయటకు తీస్తారేమో అన్నది అభిమానుల ఆశ. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందన్న మాట నిజమే అని, అయితే అది ఎలాంటి కథో ఇంకా డిసైడ్ అవ్వలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పవన్ త్వరత్వరగా సినిమాలు చేసే మూడ్లో ఉన్నాడు. తన దగ్గర అట్టే సమయం లేదు. ఇప్పటికే స్క్రిప్టు సిద్ధంగా ఉంది కాబట్టి, కోబలి ఎంచుకుంటే సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ లెక్కన కోబలి పట్టాలెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి పవన్ మనసులో ఏముందో...?