'బాహుబలి' తర్వాత ప్రబాస్ నుండి వస్తున్న సినిమా అంటే, భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అలా భారీ బడ్జెట్తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కిన 'సాహో' వెరీ బ్యాడ్ రిజల్ట్ మిగిల్చింది ప్రబాస్కి. ఇక ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రబాస్ 'జాన్' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా విషయంలో ఇంతవరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ, లేటెస్ట్గా ఓ అప్డేట్ ఇచ్చారు.
ఓ వింటేజ్ భవంతిలో మన డార్లింగ్ తీక్షణంగా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్న లుక్ని రిలీజ్ చేశారు. ఆ భవంతి, ఆ భవంతిలోని ఫర్నీచర్.. ఆ సెటప్ చూస్తుంటే, ఇది కూడా రిచ్ మూవీనే అనే తలంపు తీసుకొచ్చేలా ఉంది ఈ ఫస్ట్లుక్. 1960 బ్యాక్ డ్రాప్లో జరిగే అందమైన లవ్స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యూరప్లోని కాస్ట్లీ లొకేషన్లు ఈ సినిమాలో భాగం కానున్నాయట. అయితే, యూరప్ లొకేషన్స్ కోసం అంత భారీ ఖర్చు చేయడం లేదట చిత్రయూనిట్. అక్కడి లొకేషన్స్ని తలపించేలా అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ రూపొందిస్తున్నారట. ఆ సెట్లోనే దాదాపు షూటింగ్ పూర్తి చేయనున్నారట.
తాజా షెడ్యూల్ని ఈ సెట్లోనే ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్లో జాయిన్ అవుతున్నా.. అంటూ ప్రబాస్ ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్కి అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే ఫ్యాన్స్ మెచ్చే మరో సర్ప్రైజ్ రానుందట 'జాన్' నుండి. పూజా హెగ్దే ఈ సినిమాలో ప్రబాస్తో జోడీ కడుతోంది.