తాతామనవళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం `ప్రతిరోజూ పండగే`. సాయిధరమ్ తేజ్ మనవడిగా, సత్యరాజ్ తాతయ్యగా నటించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. తొలి రోజు మంచి టాక్ అందుకుంది. వసూళ్లూ బాగున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 8 కోట్ల గ్రాస్ తెచ్చుకుందని చిత్రబృందం ప్రకటించింది. ఆలెక్కన ఇప్పటి వరకూ తొలిరోజు అత్యధిక వసూళ్లు అందుకున్న తేజూ చిత్రాలలో ఇదే మొదటి స్థానం ఆక్రమించినట్టైంది.
ఇది వరకు చిత్రలహరి తొలిరోజు 6 కోట్ల వరకూ తెచ్చుకుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నైజాంలో ఈ చిత్రానికి 1.25 కోట్లు వచ్చాయి. సీడెడ్లో 35 లక్షలు, గుంటూరులో 30 లక్షలు, కృష్ణాలో 21 లక్షలు, ఈస్ట్, వెస్ట్ కలిపి 50 లక్షలు తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ చిత్రానికి 16 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. శని, ఆదివారాలూ ఇదే జోరు కొనసాగించే అవకాశాలున్నాయి. క్రిస్మస్ సెలవలు కూడా కలిసొస్తే.. బయ్యర్లంతా గట్టెక్కేసినట్టే.