సాయిధరమ్ తేజ్కు ఈ యేడాది బాగానే కలిసొచ్చింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజూ.. `చిత్రలహరి`తో ఓ డీసెంట్ హిట్ కొట్టాడు. ఆ సినిమా భారీ వసూళ్లని దక్కించుకోలేదు గానీ, తనకు కాస్త ఉపశమనం కలిగించింది. ఇప్పుడు `ప్రతీ రోజూ పండగే` మాత్రం ఊహించని కమర్షియల్ హిట్ ని చేతికి అందించింది. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. రాశీఖన్నా కథానాయిక. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. తొలి 10 రోజులకు గానూ ఈ సినిమా రూ.25 కోట్లు దక్కించుకుంది. తేజూ కెరీర్లో ఇదే రికార్డు. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో దాదాపు 15 కోట్లు వచ్చాయి. అవన్నీ నిర్మాతకు మిగులు అనుకోవాలి.
ఈ వారాంతంలో మరో 5 కోట్లు చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ సినిమా రూపంలో నిర్మాతలకు 20 కోట్ల మిగులన్నమాట. ఇది నిజంగా గొప్ప విజయమే. నైజాంలో అత్యధికంగా 9 కోట్లు తెచ్చుకున్న ఈ సినిమా, సీడెడ్లో 2.67 కోట్లు సంపాదించింది. ఉత్తరాంధ్రలో 3.27 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్లో 2.15 కోట్లు దక్కించుకుంది. కృష్ణాలో 1.52 కోట్లు వచ్చాయి. ఈస్ట్, వెస్ట్ కలిపి 2.6 కోట్లు సంపాదించింది.