అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'రేసుగుర్రం' సినిమా నంది అవార్డ్స్ లిస్టులో లేకపోవడం చాలా బాధాకరమని ఆ చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం నిర్మాత అయిన నల్లమలుపు బుజ్జి తన ఆవేదనని ఓపెన్గా మీడియా ముందు వెల్లబుచ్చారు. బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్టంట్స్ మాస్టర్ ఇలా.. అనేక విభాగాల్లో ఈ సినిమాకి అవార్డును ఆశించాం. కానీ ఏ ఒక్క విభాగంలోనూ అవార్డు వరించలేదు. ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం అని నిర్మాత నల్లమలుపు ఆవేదన చెందుతున్నారు.
100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా ఇది. ఖచ్చితంగా అన్ని విభాగాల్లోనూ అవార్డులు రావాల్సిన సినిమా. అలాంటిది ఏ ఒక్క విభాగంలోనూ ఈ సినిమాని గుర్తించలేదని వారి ఆరోపణ. ఇదిలా ఉండగా, చారిత్రాత్మక చిత్రమైన 'రుద్రమదేవి' సినిమాకి ఇదే తీరు. ఈ సినిమా విషయంలోనూ డైరెక్టర్ గుణశేఖర్ అదే రకంగా ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా ఈ సినిమాకి అన్యాయం జరిగిందంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ది బెస్ట్ సపోర్టింగ్ రోల్. అంతేకాదు ఓ స్పెషల్ రోల్ అది సినిమాకి. అలాంటిది, ఆయన్ని తీసుకెళ్లి క్యారెక్టర్ ఆర్టిస్టు విభాగంలో పడేశారు.
మొదటి, ద్వితీయ, తృతీయ, లేదా స్పెషల్ జ్యూరీ ఇలా ఇన్ని విభాగాలుండగా, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోని తీస్కెళ్లి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగంలో పడేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఇక 'మనం' సంగతి సరే సరి.. ఆ సినిమాకి ప్రతీ క్యారెక్టర్కీ పేరు పేరునా అవార్డులు రావాల్సిందే. డైరెక్టర్ దగ్గర నుండీ ప్రతీ టెక్నీషియన్ కూడా అవార్డుకు అర్హుడే. అలాంటిది, హీరో అయిన నాగ చైతన్యని తీస్కెళ్లి, సపోర్టింగ్ ఆర్టిస్ట్ కేటగిరిలో పడేశారు. ఇంతకన్నా అవమానం మరోటి ఉంటుందా? ఇలా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తెలుగు సినీ పరిశ్రమలో సర్వత్రా పలు వివాదాలు నెలకొన్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ రగడ ఇంకా ఎంత దూరం పోనుందో చూడాలి మరి.