బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం `రైడ్`. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. నాగార్జున కథానాయకుడిగా నటిస్తారని చెప్పుకున్నారు. అయితే నాగ్ వేరే సినిమాతో బిజీగా ఉండడం వల్ల, ఈ ప్రాజెక్టు గురించి మళ్లీ ఎలాంటి వార్తలు రాలేదు. ఇప్పుడు ఈ రీమేక్లో కదలికలొస్తున్నాయని, ఈ సినిమాని నాగ్ చేయడం ఖాయమని తెలుస్తోంది. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు పేరు వినిపిస్తోంది. గరుడవేగ సినిమాతో ఆకట్టుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఆ తరవాత.. మరో సినిమా చేయలేదు.
ఈసారి మాత్రం పెద్ద హీరోతోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఓ కథ కూడా రెడీ చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఈ రీమేక్ ఛాన్స్ తనకి దక్కింది. నాగ్తో సినిమా అంటే ఓ మెట్టు పైకి ఎక్కినట్టే. అందుకే రీమేక్ అయినా సరే, చేయడానికి రెడీ అయ్యాడని టాక్. అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.