ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే దక్కించుకోవాలి అంటుంటారు పెద్దలు. అదే ఫార్ములా ఫాలో అవుతోంది మన క్యూటీ అండ్ స్మైలీ బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్. అదేనండీ తెలుగులో ఆమె జోరు ఫుల్గా ఉన్న టైంలో బాలీవుడ్పై కన్నేసింది. 'అయ్యారీ' సినిమా పేరు చెప్పి బాలీవుడ్కి చెక్కేసింది. ఇంకేముంది అక్కడ కూడా తెలుగులో మాదిరే దున్నేసుకోవాలనుకుంది పాపం ఈ బ్యూటీ.
అయితే సీను రివర్స్ అయ్యింది. భారీ అంచనాల నడుమ, భారీ ఆశల నడుమ విడుదలైన 'అయ్యారీ' రిజల్ట్ బెడిసికొట్టడంతో విమర్శలు రకుల్ప్రీత్సింగ్ని వెంటాడేశాయి. అయినా రకుల్ ఏమాత్రం లొంగకుండా, అక్కడ మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ లోగా తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంది. సూర్య, కార్తి, శివకార్తికేయన్ ఇలా అక్కడ ఓ మోస్తరు స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంది.
తమిళంలో బిజీగా ఉంటూనే బాలీవుడ్నీ వదిలి పెట్టలేదు. ఆల్రెడీ 'అయ్యారీ' తర్వాత రకుల్ 'దే దే ప్యార్ హై' చిత్రంలో నటిస్తోంది. అజయ్దేవగన్ ఈ సినిమాలో హీరో. ఇదిలా ఉంటే, తాజాగా రకుల్ ఖాతాలో మరో కొత్త ఆఫర్ వచ్చి చేరింది బాలీవుడ్లో. అదే 'మర్జవాన్' మూవీ. ఈ సినిమాకి మిలాప్ జవేరీ డైరెక్టర్. 'అయ్యారీ'లో రకుల్తో జోడీ కట్టిన యంగ్ హీరో సిద్దార్డ్ మల్హోత్రానే ఈ సినిమాలో కూడా హీరో కావడం విశేషం. రితీష్ దేశ్ముఖ్, తారా సుతారియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇకపోతే తెలుగులో రకుల్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్'లో అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.