కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో ‘రిజనబుల్ స్క్రీన్ స్పేస్’ వున్న ఓ స్పెషల్ రోల్ కోసం తొలుత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు విన్పించింది. చరణ్ ఆ పాత్రలో కన్పించబోతున్నాడనీ, భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకున్నాడనీ, ఓ పాటని చరణ్ మీద ఇప్పటికే చిత్రీకరించారనీ ప్రచారం జరిగింది. కైరా అద్వానీతో ఈ సినిమాలో రామ్ చరణ్ రొమాన్స్ చేయబోతున్నాడన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మహేష్బాబు పేరు తెరపైకొచ్చింది. అసలు ఇంతకీ వాస్తవం ఏంటి.? అంటే, దానికి మెగాస్టార్ చిరంజీవి సమాధానమిచ్చారు.
‘ఆచార్య’ సినిమాలో గెస్ట్ రోల్ చరణ్తో చేయించాలన్నది కొరటాల శివ ఆలోచన అని చెప్పారు చిరంజీవి. ‘నేను, మా అబ్బాయి రామ్ చరణ్.. ఇద్దరం కలిసి నటించాలన్నది నా భార్య సురేఖ కోరిక.. కానీ, కథ రాసింది కొరటాల శివ కాబట్టి.. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే సినిమా వుంటుంది..’ అని చిరంజీవి చెఫ్పుకొచ్చారు. ‘మహేష్తో సినిమా చేయాల్సి వస్తే అది చాలా ఆనందకరమైన విషయం.. కానీ, మహేష్ మా సినిమాలో నటిస్తున్నాడన్న ప్రచారంలో నిజం లేదు..’ అని చిరంజీవి కొట్టి పారేశారు. అన్నట్టు, రామ్ చరణ్ ‘ఆచార్య’లో నటించడానికి రాజమౌళి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాలట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనుల్లో చరణ్ బిజీగా వున్నాడు.. ‘ఆచార్య’ కోసం టైమ్ కేటాయించాల్సి వస్తే, ముందుగా రాజమౌళి అనుమతి తీసుకోవాల్సిందే.. అని చిరంజీవి చెప్పడం గమనార్హం. అంటే, ఇంతవరకు ‘ఆచార్య’లో ఆ ప్రత్యే పాత్ర విషయమై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే వుందన్నమాట.