ఈ నెల 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది చరణ్ బర్త్డే వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూంటారు మెగా అభిమానులు. అయితే, ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల సంగతి తెలిసిందే. అందుకే ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్ విషయమై రామ్ చరణ్ ఓ ప్రకటన చేశాడు. ‘మనమున్న అసాధారణ పరిస్థితులు మనకు తెలియనివి కావు. అందుకని ఈ ఏడాది నా బర్త్డే వేడుకలను నిలిపివేయాలని కోరుతున్నా.. కరోనా కారణంగా ఎక్కువమంది గుమిగూడి పండగలు చేసుకునే పరిస్థితులు లేవు.
అందుకే ఈ ఏడాది ఎక్కడా నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని కోరుకుంటున్నా. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మన ప్రభుత్వాలు తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. మనం కూడా ప్రభుత్వాలకు మన వంతు పూర్తి సహాయ, సహకారాలు అందించాలి. సామాజిక బాధ్యతతో నా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటే, అదే ఈ ఏడాది నాకు మీరిచ్చే అతి పెద్ద పుట్టినరోజు కానుక.. అభిమానులుగా మీ బాధను అర్ధం చేసుకోగలను కానీ, సహృదయంతో నా మనవిని ఆలకిస్తారనీ ఆశిస్తున్నా..’ అని చరణ్ ఓ లేఖ ద్వారా అభిమానులకు సూచించారు.
మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకునే జాగ్రత్తలను రీసెంట్గా చరణ్, తన కోస్టార్ ఎన్టీఆర్తో కలిసి ఓ వీడియో ద్వారా వివరించిన సంగతి తెలిసిందే.