సాధారణంగా హీరో సినిమాలకే అదీ స్టార్ హీరో సినిమాలకే పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, వాటికి పూల దండల అలంకరణలూ, పాలాభిషేకాలు చేస్తుంటారు అభిమానులు. కానీ ఓ హీరోయిన్కి భారీ కటౌట్ పెట్టడమంటే అది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. గతంలో అనుష్క సినిమాకి ఇలా జరిగింది. ఇప్పుడు మళ్లీ సమంత సినిమా కోసం ఫ్యాన్స్ ఆ రేంజ్లో హడావిడి చేస్తున్నారు.
హైద్రాబాద్లోని ఓ ధియేటర్ వద్ద సమంత భారీ కటౌట్ పెట్టి, ఫ్యాన్స్ ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నారు. ఈ వారం సమంత నటించిన 'ఓ బేబీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఓ బేబీ' విడుదల కానున్న ధియేటర్స్ వద్ద అప్పుడే ఫ్యాన్స్ కోలాహలం మొదలైంది. సోషల్ మీడియా వేదికగానూ 'ఓ బేబీ'కి భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి తెలుగు రీమేక్గా తెరకెక్కుతోన్న 'ఓ బేబీ'పై భారీగా అంచనాలున్నాయి.
నందినీ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఇటీవల చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని వచ్చిన సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందింది. నాగశౌర్య హీరోగా నటించాడు. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తేజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.