ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. జయంతి శ్వాసకు సంబంధించిన ఇబ్బందితో బాధ పడుతున్నారని, ప్రస్తుతం ఆమెను వెంటలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, 24 గంటలూ ఆమె ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.
జయంతి వయసు 71 సంవత్సరాలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారుగా 500 చిత్రాల్లో నటించిన అనుభవం ఆమెకుంది. కన్నడలో రాజ్కుమార్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి ఆమె. రాజ్కుమార్తో ఏకంగా 30 చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఎన్టీఆర్ తో చేసిన జగదేకవీరుడి కథ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. జయంతికి రాజకీయ నేపథ్యమూ ఉంది. పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేదు.