'అమ్మ కోసం ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నా.. చాలాకాలం తర్వాత ఈ పని చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా వుంది..' అంటూ సీనియర్ నటి రేఖ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందర్నీ షాక్కి గురిచేశాయి. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు సినిమాల్లో నటించారు. ఇది చాలా కాలం క్రిందటి వ్యవహారం. రేఖ కూడా ఒకటీ అరా సినిమాల్లో నటించినా, అదిప్పటి వ్యవహారం కానే కాదు. బాలీవుడ్కి వెళ్ళాక, ఏనాడూ తెలుగు సినీ పరిశ్రమ వైపు చూడలేదామె. అక్కినేని అవార్డ్ కోసం హైద్రాబాద్ వచ్చిన రేఖ, అనర్గళంగా తెలుగులో మాట్లాడేస్తోంటే అంతా విస్తుపోయారు.
'నేనూ మీ తెలుగమ్మాయినే..' అంటూ రేఖ చేసిన వ్యాఖ్యలతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. అమ్మ కోసమే, అమ్మ ప్రోద్బలంతోనే గతంలో ఒకటీ అరా తెలుగు సినిమాలు చేశాననీ, ఇప్పుడు మళ్ళీ చేయాలనుకుంటున్నాననీ రేఖ చెప్పారు. అయితే, రేఖ తెలుగులో నటించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఓ ప్రముఖ నిర్మాత కారణమని తెలుస్తోంది. సినిమా కూడా ఖరారయ్యిందట. ఆ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయట. ఇదిలా వుంటే, అక్కినేని నాగేశ్వరరావుతో తన అనుబంధం చాలా ప్రత్యేకమైనదనీ, ఆరోగ్యకరంగా జీవించడం, మానసిక ప్రశాంతతో జీవించడమెలాగో చిన్నప్పుడే తనకు అక్కినేని నేర్పించారని రేఖ చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అక్కినేని చెప్పిన ఆహార సూత్రాల్నే పాటిస్తున్నానని అన్నారామె