సినీ పరిశ్రమలో ఎవరి అదృష్టం.. ఎప్పుడు ఎలా మారుతుందో.. ఎవరూ ఊహించలేరు. కొందరి జీవితాల్లో అనుకోకుండానే వెలుగు వస్తుంది. అలా ఇండస్ట్రీకి పరిచయమైన, పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి మహిళ స్వరానికి ఇప్పుడు సంగీత ప్రపంచం జేజేలు పలుకుతోంది. ప్రస్తుతం తెలుగు సంగీత ప్రపంచంలో సింగర్ బేబీ ఓ సంచలనం.
సోషల్ మీడియా ద్వారా ప్రసిద్ధమైన ఆమె గాత్రాన్ని ఇప్పుడు సంగీత ప్రముఖులు కూడా ఔరా అని మెచ్చుకుంటున్నారు. కనీసం చదవటం, రాయటం కూడా రాని బేబీ.. అనుకోకుండా పాడిన పాట సామాజిక మాధ్యమాలలో మారు మోగిపోయింది. అలా తెలుగు పరిశ్రమకు సుపరిచితురాలు అయిన ఈ కోయిలమ్మ ప్రస్తుతం చదవటం, రాయటం నేర్చుకోవాలని నిర్ణయించుకుందట.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, ఆమెను చదువు నేర్చుకోమని.. అందుకు వసంత పంచమి రోజునే అక్షరాభ్యాసం చేయమని చెప్పారట. అందుకే, వసంత పంచమి రోజున వైజాగ్ లో ఓ గుడిలో అక్షరాబ్యాసం చేయించుకుందట. కాగా, తన సోదరి కుమార్తె సహాయంతో త్వరలోనే చదవటం, రాయటం నేర్చుకుంటానని బేబీ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి, ప్రస్తుతం పూర్తి ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట బేబీ.