బాలు మరణం యావత్ సంగీత ప్రపంచాన్నీ విషాదంలో ముంచెత్తింది. ఆయన గురించీ, ఆయన పాడిన పాటల గురించీ, చేసిన సంగీత సేవ గురించీ.. అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అయితే సందట్లో సడేమియా అన్నట్టు... బాలు విషయంలో కొన్ని రూమర్లు బయటకు వచ్చాయి. బాలు కి చికిత్స అందించిన ఎం.జీ.ఎం ఆసుపత్రి భారీ బిల్లు వేసిందని, ఆ బిల్లుని బాలు కుటుంబ సభ్యులు చెల్లించలేదని, బకాయిలు చెల్లిస్తే గానీ, పార్థీవదేహం ఇవ్వమని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని, చివరికి ఈ విషయంలో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాల్సివచ్చిందని అనేక రూమర్లు వినిపించాయి.
దీనిపై బాలు తనయుడు ఎస్.పి,చరణ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎందుకు పుట్టించారో, ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు చేసిన పని వల్ల, అందరూ బాధ పడుతున్నామని, మేమంతా సమాధానం చెప్పుకోవాల్సివచ్చిందని వాపోతున్నారు. ''ఎంజీఎం ఆసుపత్రిపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. మా నాన్నగారికి వాళ్లంతా అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్లు చేసిన సేవ మాటల్లో చెప్పలేను. త్వరలోనే ఎంజీఎం ఆసుపత్రితో పాటు, నేను కూడా ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తాను. అందులో అన్ని వివరాలూ బయటపెడతా. దయ చేసి ఇప్పటికైనా ఇలాంటి పుకార్లని వెంటనే ఆపండి'' అన్నారు చరణ్.