మొదట్నుంచీ సుధీర్బాబు సెపరేట్ రూట్లోనే పయనిస్తున్నాడు. హీరోగా తొలి చిత్రం 'ఎస్ఎమ్ఎస్'. ఆయనకి కొన్ని విమర్శలు తీసుకొచ్చినా, ప్రశంసల్నీ పంచిచ్చింది. రాను రాను నటుడిగా తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానం అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు సుధీర్బాబు ఓ పరిణీతి చెందిన నటుడు. ఈ ప్రయాణంలో ఆయన నెగిటివ్ రోల్స్ కూడా ట్రై చేశాడు.
ఏ రకమైన ఎమోషన్ అయినా పండించగల స్టామినా సంపాదించాడు. విభిన్న తరహా చిత్రాల్లో నటించడానికి ఎప్పుడూ ఉబలాడపడుతుంటాడు సుధీర్బాబు. ఇంతవరకూ ఏడు చిత్రాల్లో నటించాడు. ఏడు సినిమాలూ వేటికవే విభిన్నమైనవి కావడం విశేషం. త్వరలో 'సమ్మోహనం' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుధీర్బాబు. ఈ జర్నీలోనే కొంచెం కొత్తగా ఆలోచించి, నిర్మాతగా కూడా సత్తా చాటాలనుకుంటున్నాడు.
ఆ క్రమంలోనే 'ఎస్బీ' అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. లేటెస్టుగా ఆ లోగో లాంఛింగ్ జరిగింది. తన సొంత నిర్మాణంలో తానే కాకుండా, ఇతర హీరోలతో కూడా సినిమాలు రూపొందిస్తానని సుధీర్బాబు అన్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో సుధీర్బాబు హీరోగా తొలి సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాకి ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా ఈ బ్యానర్ నుండి ముందు ముందు ఎన్నో విభిన్న చిత్రాలు రూపొందుతాయని నమ్మకంగా చెబుతున్నాడు సుధీర్బాబు. అంతేకాదట, చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా ఈ బ్యానర్లో సినిమాలు రూపొందిస్తానని కాన్ఫిడెంట్గా చెబుతున్నాడీ ఘట్టమనేని వారి అల్లుడు.