సుకుమార్లో చాలా కళలున్నాయి. కథలు రాస్తాడు. కవిత్వం చెబుతాడు. తనలో ఓ మంచి నిర్మాత ఉన్నాడు. ఇప్పుడు ఎడిటర్ అవతారం కూడా ఎత్తాడు. ఉప్పెన సినిమా కోసం. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. అన్నీ కుదిరితే.. ఏప్రిల్ తొలి వారంలో విడుదల కావాలి. అయితే కరోనా పుణ్యమా అని సినిమాలన్నీ ఆగిపోయాయి. ఉప్పెన కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు. షూటింగ్ అయితే ఆగింది గానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి మాత్రం ఢోకా లేకుండా పోయింది.
ఉప్పెన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా సుకుమార్ ఎడిటర్ అవతారం ఎత్తాడు. సినిమా చూసి తనవైన మార్పులు, చేర్పులూ చెబుతున్నాడట. ఇప్పటికే సుకుమార్ ఫైనల్ రష్ చూసేశాడు. అయితే ఎక్కడ ట్రిమ్ చేయాలో, ఎక్కడ లెంగ్త్ పెంచవచ్చో కొన్ని సూచనలు చెబుతున్నాడట. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడు. గురువు చెబితే.. శిష్యుడు చేయకుండా ఎందుకుంటాడు? పైగా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు సుకుమార్.