కరోనాపై పోరాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతూ, తన వంతు సాయంగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ 10 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగలేదాయన. తను పుట్టిన ఊరునీ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో తన సొంతూరు అయిన మలికిపురం మట్టపర్రు గ్రామానికి 5 లక్షలు విరాళం అందించారు. దీనిలో భాగంగా గ్రామంలో రేషన్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తికీ 1000 రూపాయల చొప్పున అందించేలా ఏర్పాట్లు చేశారు.
అన్నీ బాగుండి కాలం కలిసొస్తే, అప్పుడే సంపాదించుకోవచ్చు గాక.. ఇప్పుడీ కరోనా కారణంగా పనులు లేక, తినడానికి తిండి లేక తన గ్రామస్థులు బాధపడకూడదనీ ఆయన కోరుకున్నారు. మిత్రులైనా, శత్రువులైనా ఎవ్వరికైనా సరే, ఇలాంటి కష్టం రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుకుమార్ చేసిన సాయానికి ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా గ్రామస్థులు తెలిపారు. అలాగే ఆపద కాంలో తన పుట్టిన ఊరును గుర్తుంచుకుని, ఇంత గొప్ప సాయం చేసినందుకు ఆ గ్రామ ఎస్సై నాగరాజు సుకుమార్ని ప్రశంసించారు. ఈ సహాయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు సర్.. అంటూ ఏ సందర్బంగా ఓ నెటిజన్ సుకుమార్కి సెల్యూట్ చేశారు.