కొత్తబంగారు లోకంతో.. ఆకట్టుకున్న కథానాయిక శ్వేత బసు ప్రసాద్. ఎక్కడా... అంటూ సాగదీసి, చిలిపిగా అల్లిర చేసింది. ఆ హిట్టుతో తెలుగునాట కొన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోగలిగింది. అయితే.. క్రమంగా ఫ్లాపుల్లో పడి, తెర మరుగైంది. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. రోహిత్ మిట్టల్ అనే నిర్మాతతో శ్వేత వివాహం జరగబోతోంది.
డిసెంబరు 13న పూణెలో.. వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటవ్వబోతున్నారు. ఆ తరవాత ముంబైలో వివాహ విందు ఘనంగా ఇవ్వబోతోంది ఈ జంట. కొంతకాలం క్రితం వ్యభిచారం కేసులో చిక్కుకుని.. సంచలనం సృష్టించింది శ్వేత. అలాంటి క్లిష్టసమయంలోనే రోహిత్ దగ్గరయ్యారు. అప్పటి నుంచీ ఇద్దరూ సహ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల మనసు పెళ్లి వైపు మళ్లింది.
ప్రస్తుతం ఈ జంట ఇండోనేషియాలో ఉంది. అక్కడ పెళ్లి షాపింగ్ లో వీరిద్దరూ బిజీగా ఉన్నారు. ఈ వారంలోనే ఇండియా తిరిగి రాబోతున్నారు. పెళ్లయ్యాక.. సినిమాలకు, బుల్లి తెరకు శ్వేత దూరమయ్యే అవకాశాలున్నాయి. తెలుగు చిత్రసీమలో శ్వేతకు మంచి స్నేహితులున్నారు. వాళ్లలో పెళ్లి ఆహ్వానాలు ఎవరికి అందుతాయో చూడాలి.